Saturday, November 13, 2010

అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు అక్రమ తీర్పు

సెప్టెంబరు 30న ఇద్దరు న్యాయాధీశులు –సిగ్భత్ ఉల్లాఖాన్, సుధీర్ అగర్వాల్ లు ఒక తీర్పునివ్వగా ప్రధాన న్యాయాధీశుడు ధరమ్ వీర్ శర్మ విడిగా తీర్పు రాశాడు. బాబ్రీ మసీదులో 1949 డిసెంబరు 23న కొంతమంది చట్ట విరుద్ధంగా సీతారాముల విగ్రహాలను పెట్టిన స్తలమే రాముడు పుట్టిన స్తలంగా హిందూ ప్రజానీకం విశ్వాసం గనుక ఆ స్తలాన్ని హిందూత్వ సంస్థలకు కేటాయించాలి. మొత్తం వివాదాస్పద 1500 గజాల స్తలాన్ని మూడు భాగాలుగా విభజించింది. దౌర్జన్యంగా రామలీలా విగ్రహాలుంచబడిన స్ధలంతో సహా ఒక భాగాన్ని హిందువుల సంస్థకూ, ఒక భాగాన్ని ముస్లీములకు, రామచబుత,సీతరచోయి కట్టడాలతోకూడిన మూడవభాగాన్నిహిందూ సాధువుల సంస్థ నిర్మోహి ఆఖారాకు కేటాయించింది. 1992 డిసెంబరు 6 వరకు అక్కడ మసీదు వుండేదని ఇద్దరు జడ్జీలు అంగీకరించారు కానీ ప్రధాన న్యాయాధీశుడు శర్మ గారు మాత్రం ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలు లేవు పొమ్మన్నాడు. కానీ ముస్లీములు దానిని 400సంవత్సరాలుగా విశ్వసిస్తున్నారన్నవిషయం ఆయనకు పట్టలేదు. సమాజంలో ఆధిపత్య భావజాలానికి న్యాయస్థానాలు అతీతం కాదు. కీలవన్మేణి (తమిళనాడు), భన్వారీదేవి (రాజస్తాన్) తీర్పులు నగ్నంగా రుజువు చేసినట్లే అయోధ్య తీర్పుకూడ రుజువు చేసింది.

యస్.ఆర్.శంకరన్ కు నివాళి

హైదరాబాదు 7-10-2010. ఐ.ఏ.ఎస్. అధికారిగా వుండి ఎన్నో ముఖ్య పదవులు నిర్వహించి, నైతిక విలువలు కలిగి, నీతిగా, నిజాయితీగా, మానవతావాదిగా, ప్రజాతంత్రవాదిగా తుది శ్వాసవరకూ నిలిచిన యస్.ఆర్. శంకరన్ గారి మరణం దిగ్బ్రాంతి కరం. ఆయన వంటివారు కాగడా పెట్టి వెదకినా లభించడం ఈ రోజు కన్పించడం అనుమానాస్పదం. దళితులకు విద్య, రిజర్వేషన్ల కోసం ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. పేద ప్రజలకు ఇండ్ల స్తలాలకోసం, భూసంస్కరణ చట్టం అమలు కోసం, అవినీతి నిర్మూలనకోసం కృషి చేశారు. మన అందరిమధ్య సాధారణ జీవితం గడిపారు. ఆయన కృషి ఫలితంగా 2004లో ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలు జరిపారు. ఆయన మృతి తీరని లోటు.

ఇట్లు,

వి.నారాయణ, సి.భాస్కరరావు.