అనంతపురం -
చెన్నేకొత్తపల్లి మండలము నామాల గ్రామంలో 29-3-2011 న రాత్రి 9గంటలకు స్తానిక యు.పి.స్కూలు నందు ఆధార్ కార్డుల కొరకు పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అప్పుడు ఆశాది తిరుపాలు అనే దళితుడు వికలాంగుడైనందున ఎక్కువ సేపు నిలబడలేక కూర్చోడానికి కుర్చీని అడుగగా ఆధార్ కార్డు సభ్యులు తిరుపాలుకు కుర్చీఇచ్చారు. ఇది సహించలేని రెడ్డి కులస్తులిద్దరు తిరిపాలును కొట్టి కుర్చీని లాగివేయడానికి ప్రయత్నించారు. ఈరోజు వికలాంగుడనని ఓ దళితుడు మాముందు కుర్చీలో కూర్చుంటే రేపు బాగున్న దళితుడుకూడా కూర్చుంటాడని అన్నారు. స్తానికులు కొందరు కలుగజేసికొని వారిని బయటకు పంపారు. వారు బయటికి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చున్న తిరిపాలును జుట్టు పట్టుకొని బలంగా లాగి కిటికీ చెక్కదిమ్మెకు వేసి పొడిచారు. క్రింద పడిపోయిన తిరిపాలును కుటుంబ సభ్యలు ఇంటికి తీసుకువెళ్ళి నీళ్ళు త్రాగించబోతుండగా తిరిపాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆటోలో ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోగా అప్పటికే ప్రాణం పోయినట్లు డాక్టరు నిర్ధారించాడు.
ది.3-4-11న ఓపిడిఆర్, హెచ్చారెఫ్, ఎపిసిఎల్ సి, కులనిర్మూలనా పోరాటసమితి, పట్టణ పేదల సంఘం, మరియు సత్యసాయి వాటర్ వర్క్స సభ్యులు తిరుపాలు కుటుంబాన్ని విచారించారు. తిరుపాలు తల్లి కుళ్ళాయమ్మ, భార్య నాగులమ్మ, కుమారుడు సంజీవ రాయుడు (16), కూతుర్లు శివకుమారి (14), పరమేశ్వరి (12) జరిగిన సంఘటనను వివరిస్తూ కంటతడి పెట్టారు.
కమిటీ ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోష్టు మార్టం చేసిన డాక్టరును విచారించగా తిరిపాలు ఎడమ కణతపై ఎముక విరిగీ రక్తస్రావము జరిగి, మెదడులోకి రక్తముచేరి,రక్తము గడ్డకట్టి మరణించాడని చెప్పాగు. తిరిపాలును చంపినవారిపై కేసు నమోదుచేసి శిక్షించాలని, భార్య నాగులమ్మకు ప్రభుత్వోద్యోగం కల్పించి తిరిపాలు కుటుంబాన్ని ఆదుకోవాలని ఓపిడిఆర్ డిమాండ్ చేసింది.