Thursday, November 12, 2009

డాక్టర్. బాలగోపాల్ కు జోహార్లు

ప్రముఖ హక్కుల ఉద్యమనేత మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాద్యక్షుడు బాలగోపాల్ ది. 8-9-09 న ( గురువారం ) రాత్రి 10గంటలకు హఠాన్మరణం చెందాడు. ఆయన మృతికి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ( ఓపిడిఆర్ ) రాష్ట్ర కమిటీ సంతాపం తెలుపుతూ జోహార్లు అర్పిస్తున్నది.
గత 30 సంవత్సరాల నుండి హక్కుల ఉద్యమంలో పనిచేస్తూ వచ్చాడు. గిరిజనులు, దళితులు, మహిళలు, నిర్వాసితులు, మురికివాడలు, ఎన్ కౌంటర్లు, లాకప్ మరణాలు లాంటి విషయాలన్నిటిపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, వాస్తవ సేకరణ కమిటీలు వేసి సమస్యలను వెలుగులోకి తెచ్చాడు. పరిష్కారం కోసం కృషి చేశాడు. గుజరాత్, ఒరిస్సా, కర్ణాటకలలో జరిగిన మత అల్లర్లపై ఎఫ్. ఎఫ్. సి. వేసి పుస్తకాలు వేసి ప్రచారం చేశాడు. మణిపూర్, కాశ్మీర్ లలో సైనికులు అమలుజరుపుతున్న నిర్బంధకాండ, హత్యలపై ప్రచారం చేశాడు. అనేక సమస్యలపై అధ్యయనం చేశాడు. విస్తృతంగా పత్రికలలో వ్యాసాలు రాశాడు.
హైకోర్టులో పేద ప్రజల తరఫున కేసులు వేసి వాదించాడు. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం ప్రకారం కేసు నమోదు చేయాలని వాదించి విజయం సాధించాడు. ముస్లిమ్ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి, హింసించడాన్ని వ్యతిరేకిస్తూ, అన్ని హక్కుల ఉద్యమాలతో కలసి పనిచేశాడు. ఆయనతో ఓపిడిఆర్ కు 26 సంవత్సరాల అనుబంధం ఉంది.
ప్రజలు తమ హక్కులు తెలుసుకొని సంఘటితంగా పోరాడిననాడే అన్ని రకాల హింసలు అంతమవుతాయని నమ్మి, దానికోసం పనిచేశాడు. హక్కుల ఉద్యమానికి ఆయన లేని లోటు తీవ్రమైనది. ప్రజాస్వామిక ప్రజల హక్కుల కోసం పని చోయటమే ఆయనకు మనమిచ్చే నివాళి. బాలగోపాల్ కు జోహార్లు.
సి.హెచ్. సుధాకరరావు, అధ్యక్షులు. ఓ.పి.డి.ఆర్., సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment