Friday, January 22, 2010

ఆంధ్ర మహాసభ నుండి శ్రీ బాగ్ ఒప్పందం వరకు

ఆరోజు 1917, ఏప్రిల్, 8వ తారీకు . అనీబిసెంటు అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ మహాసభ జరుగుతుంది. తీవ్ర చర్చల అనంతరం రాత్రి 10-గంటల 15 నిముషాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఏర్పాటుకు అఖిలభారతకాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గాంధీగారు వ్యతిరేకించినా, తిలక్ బలపరచి ఆమోదించాడు.
రాయలసీమ
అనంతపురం, బళ్ళారి, కడప జిల్లాలను నైజాం నవాబు బ్రిటీష్ వారికి దత్తం చేశాడు. బ్రిటీష్ వారు కర్నూలును బలవంతంగా తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. 1911లో కడప జిల్లాలో కొంతభాగాన్మి , ఉత్తర ఆర్కూట్ జిల్లా నుంచి తెలుగుమాట్లాడే ప్రాంతాలను కలిపి చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేశారు.
ప్రప్రధమంగా 19-1-1928న నంద్యాలలో దత్తమండల జిల్లాల మహాసభ కడప కోటిరెడ్డిగారి ఆధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు జిల్లాలకు చిలుకూరి నారాయణరావు ‘ రాయలసీమ ’ అని నామకరణం చేసారు.
ఆంద్రోద్యమ సభలు
ఆంద్రోద్యమ ప్రారంభం నుండి అనగా 1913 నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సీమవారు వ్యతిరేకులు కారు. కానీ, అభివృధ్ధి చెందిన సర్కారు ప్రాంతం నుంచి సీమప్రగతికి సరైన సహకారమందుతుందా...అనే సంశయం వీరికి ఉంది. మద్రాసు వీరికి దగ్గరగా ఉండడం, మొదటినుండి వ్యాపార లావాదేవీలు, విద్య, రాజకీయవిషయాలు ఆనగరంతో ముడిపడిఉండడం , హైకోర్టు, విశ్వవిద్యాలయం, ఇతర కార్యాలయాలు రాజమండ్రి లాంటి దూరప్రాంతంలో ఉంటే వారికి కష్టంగా ఉంటుందనేది మరొక కారణం.
1913 న 800 మందితో జరిగిన ఆంద్రమహాసభకు రాయలసీమ నుండి ఇద్దరే హాజరైనారు. కేశవపిళ్ళే , జి.లక్ష్మీరెడ్డి మరికొందరు ఆంధ్రరాష్ట్రాన్ని వ్యతిరేకించారు.1924 జనవరి 13వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆనుమతించింది. ఆప్పటినుండి సర్కారు రాయలసీమ సంబంధాలు బెడిసికొట్టాయి.
రాజకీయంగా నిరాదరణ
శ్రీమాన్ రాజగోపాలాచారి ముఖ్యమంత్రి (మద్రాసు) మొత్తం 26మంది మంత్రివర్గంలో సర్కారు వారిని 10 మందిని తీసుకొని , రాయలసీమ వారిని ఒక్కరిని కూడా తీసుకోలేదు
ఎ.పి.సి.సి. వైస్ ప్రసిడెంటు పదవికి కోటిరెడ్డి(సీమ) గారిని ప్రతిపాదించితే కాళేశ్వరరావు (బెజవాడ) వ్యతిరేకించి కోటిరెడ్డిని ఓడించాడు.
పట్టభద్రులనుంచి రెండు సెనెట్ సీట్లకు పార్టీ ప్రాతిపదికపై పోటీ జరిగింది. అధికార అభ్యర్ధులైన ఇద్దరు రాయలసీమ నాయకులను కాంగ్రెసుకు మెజారిటీ ఉన్నప్పటికీ ఓడించారు.
అవగాహనా ఒప్పందం
1937 ఆంధ్రమహాసభ బెజవాడలో కడప కోటిరెడ్డిగారి అధ్యక్షతన జరిగింది. హెచ్చి.సీతారామిరెడ్డి (బళ్ళారి), టి.ఎన్. రామకృష్ణారెడ్డి (చిత్తూరు), కల్లూరి.సుబ్బారావు, పి.రామాచార్యులు (అనంతపురం) పాల్గొని , వేదికను పూర్తిగా ఉపయోగించుకొని, రాయలసీమప్రజల సమస్యలను, అభిప్రాయాలను, అన్నివిధాలా జరిగిన మోసాలను, సర్కారాంధ్ర నాయకులపై ఉన్న అపోహలను, నిర్మొహమాటంగా, స్పష్టంగా వివరించారు. రాయలసీమవారికి కొన్ని రక్షణ ఏర్పాట్లు చేస్తేతప్ప రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో కలవదని చెప్పారు.
1) రాష్ట్ర రాజధాని మద్రాసుగానీ, రాయలసీమలో ఏదో ఒక పట్టణంకాని అయివుండాలి.
2) శాసనసభలో రాయలసీమకు సరియైన ప్రాతినిధ్యము ఉండాలి.
3) సరిసమాన సంఖ్యలో మంత్రులుండాలి.
4) ఆర్ధిక వెనుకబాటుతనం మూలాన వెంటనే తుంగభద్ర, హగరి ప్రాజక్టులు చేపట్టాలి.
5) రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పంచాలి.
ఈతీర్మానాలు సభలో ప్రవేశపెట్టడం, ఏకగ్రీవంగా ఆమోదంపొందడం జరిగింది. సభ ముగిసిన వెంటనే సభ్యులందరూ మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావుగారి శ్రీబాగ్ మహలు (Sri Baugh Palace) నందు 19 నవంబరు 1937న సమావేశమై ( సర్కారాంధ్ర, రాయలసీమ ) సామరస్యసాధనగా పెద్దమనుషుల ఒప్పందం ( శ్రీబాగ్ ఒడంబడిక ) సాధించారు. ఆస్థల గౌరవార్ధం ఆ ఒడంబడికను శ్రీబాగ్ ఒడంబడికగా పిలవడం జరిగింది.

No comments:

Post a Comment